

కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసును పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న ఆ విద్యార్థులు చెడు అలవాట్లకు లోనవుతున్నారని గమనించిన రూపారెడ్డి, వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న విద్యార్థులు, ఇంట్లో నగదు ఉంటుందనే సమాచారంతో హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడం, నేరం చేయడం, అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం వంటి అంశాలపై వారు సామాజిక మాధ్యమాల్లో శోధించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఆగస్టు 11న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక విద్యార్థి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించగా, మరో విద్యార్థి బయట కాపలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి, బెడ్రూమ్లో ఉన్న రూ.2.50 లక్షల నగదును తీసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసి సమీపంలో దాచిపెట్టడంతో పాటు, ఘటన సమయంలో ఉపయోగించిన దుస్తులు, ఇతర వస్తువులను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి 80 మందిని విచారించారు. బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.1.54 లక్షల నగదు లభించింది. వారి నుంచి రూపారెడ్డి ఐఫోన్, కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!