

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో ఇచ్చిన తాత్కాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జీవో 57ను జారీచేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు జీవో 38 ప్రకారం మే 1 నుంచి మే 31 వరకు కొన్ని నిబంధనలతో బదిలీలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, గడువు ముగియడంతో అన్ని రకాల బదిలీలను నిలిపివేసింది.
అయితే పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మినహాయింపులు కల్పించారు. ప్రత్యేక సందర్భాల్లో ఇతర ఉద్యోగులను ప్రభావితం చేయకుండా పోస్టింగ్లు ఇవ్వవచ్చని తెలిపారు. ప్రమోషన్ పొందిన వారికి ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడం, పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశీ సర్వీసులకు తిరిగివచ్చిన వారు, ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్లు, క్రమశిక్షణ చర్యల కారణంగా మార్పులు చెందిన ఉద్యోగులకు ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడానికి అనుమతి ఉంది. అలాగే ఆరు నెలలకు పైగా దీర్ఘకాల సెలవు తర్వాత తిరిగి చేరే ఉద్యోగులకు కూడా ఖాళీ ఉన్న స్థానాల్లో పోస్టింగ్ కల్పించవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!