

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిశీలిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. 1990వ దశకం నుంచి, ముఖ్యంగా 1997 నుంచి ఈ సమస్య కొనసాగుతోందని వివరించారు. అధికారిక రిజిస్టర్లో ఒకరి పేరు ఉండగా.. వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. చట్టపరంగా ఇది తీవ్రమైన అంశమైనప్పటికీ.. కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతంలో సింగరేణి యాజమాన్యం మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, దాని సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ‘మారుపేర్ల’ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 128 మాత్రమేనని భట్టి విక్రమార్క తెలిపారు. సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ చట్టపరమైన చిక్కులు ఉండటంతో అధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన అనంతరం 128 మంది ‘మారుపేర్ల’ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!