

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడుతున్న అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం నిల్వలు అంటే ‘మూడు ఎఫ్ల’పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముంబయిలో జరిగిన SIDBI వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఇంధనం, ఎరువులు, బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయని గుర్తుచేశారు. దేశీయ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గిందని వెల్లడించారు.
ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు చర్యల అవసరాన్ని వివరించగా, కొందరు నిరాశావాదులు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులకు బాహ్య అంతర్జాతీయ కారకాలే కారణమని పేర్కొంటూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే స్థితిలో దేశం ఉందని ఆమె స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!