

అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగులు పడ్డాయి. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ను కూడా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రాజెక్టులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించడంతో పాటు సంస్థ ప్రదర్శించిన ఏవీని వీక్షించారు. సుజ్లాన్ ప్రతినిధులతో మాట్లాడి ప్రాజెక్టుల పురోగతి, పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సుజ్లాన్ సంస్థ చేపట్టనున్న విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
అంతకుముందు మంత్రి నారా లోకేష్ బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో ఉన్న సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించారు. సంస్థ ప్రతినిధులతో మాట్లాడి కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విండ్ టర్బైన్పై సంతకం చేశారు.
ప్రస్తుతం ఏపీలో 1,700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యంతో సుజ్లాన్ కీలక విండ్ ఎనర్జీ భాగస్వామిగా ఉంది. 2030 నాటికి అదనంగా 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ. లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, సుజ్లాన్ గ్రూప్ కో-ఫౌండర్, వైస్ చైర్మన్ గిరీష్ తంతి పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!