

గాయని మంగ్లిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె తమ్ముడు శివ చౌహన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గత ముప్పై రోజులుగా తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తమ అక్కపై జరుగుతున్న ప్రచారం కుట్రపూరితమని, తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తన ఫోటోలు చూపిస్తూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, నిజానికి అవి ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు తీసుకున్నవేనని వివరించారు. ఒక వెంచర్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తనను పిలిచారని, ఆ సందర్భంలో తీసిన ఫోటోలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని, బాధితులు కూడా తమ పేర్లు ప్రస్తావించలేదని చెప్పారు. తమపై చేస్తున్న ఆరోపణలు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. తాను ఎప్పుడూ ఎవరికీ బెదిరింపులు చేయలేదని, కాల్స్ లేదా మెసేజ్లు కూడా పంపలేదని స్పష్టం చేశారు.
ఈ వివాదం వల్ల తమ కుటుంబానికి పరువు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేసిన శివ చౌహన్, నిజం త్వరలో బయటపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి క్లిన్ చిట్ వచ్చిన తర్వాత న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో మంగ్లిని టార్గెట్ చేస్తున్నారని పేర్కొంటూ, ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!