

కాదంబరీ జెత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై విధించిన సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. వీరిద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజీపీ హరీష్కుమార్ గుప్తా సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అధికారులపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలకు ఎలాంటి భంగం కలగకుండా ‘వితౌట్ ప్రిజుడీస్’ ప్రాతిపదికన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు నమోదు చేసి వేధించారన్న ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సమీక్ష కమిటీ అభిప్రాయంతో వారి సస్పెన్షన్ను ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చారు. తాజాగా సీఐడీ దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయడంతో, అధికారుల అభ్యర్థనలు, డీజీపీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇదే కేసులో నిందితుడైన నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆగస్టు 31న సస్పెన్షన్లోనే పదవీ విరమణ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!