

జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక నగరం కిటాక్యూషుతో పారిశ్రామిక, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కిటాక్యూషు డిప్యూటీ మేయర్ చికాకో ఓబాతో సమావేశమైంది. హైదరాబాద్ స్టార్టప్, ఐటీ ఆవిష్కరణ వ్యవస్థను కిటాక్యూషు పారిశ్రామిక సామర్థ్యంతో అనుసంధానించేలా ‘కిటాక్యూషు–తెలంగాణ టెక్నాలజీ బ్రిడ్జి’ ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. అధునాతన తయారీ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్, సెమీకండక్టర్లు, పర్యావరణహిత సాంకేతికత రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని సూచించారు.
జపాన్ కంపెనీల్లో పెరుగుతున్న మానవ వనరుల కొరతను తీర్చేందుకు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్)ను ప్రధాన వేదికగా వినియోగించనున్నట్లు చెప్పారు. కిటాక్యూషు కంపెనీల ఉద్యోగ అవసరాలు, విద్యార్హతలను సేకరించి, అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన, జపనీస్ భాష, పని సంస్కృతి, భద్రతా ప్రమాణాలపై ముందస్తు శిక్షణ అందిస్తామని వివరించారు. తెలంగాణ యువత నైపుణ్యాలను జపాన్ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!