

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన తీవ్ర మెరుపు వరదల నేపథ్యంలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ (IPS) సీఈఓ లక్ష్ గోపిశెట్టితో ప్రస్తుతం సంబంధాలు సాధ్యం కావడం లేదని ఇన్ఫోసిస్ అధికారికంగా వెల్లడించింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన నేపాల్ వెళ్లినట్లు సమాచారం. విపత్తు అనంతరం ఆయనను వీలైనంత త్వరగా గుర్తించి, క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించడమే తమ తక్షణ ప్రాధాన్యత అని కంపెనీ తెలిపింది. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, అధికారులతో కలిసి ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో గోపిశెట్టి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఐటీ, పబ్లిక్ సెక్టార్ రంగాల్లో గోపిశెట్టికి మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అమెరికా, కెనడాల్లోని ప్రభుత్వ సంస్థలకు సాంకేతిక, వ్యూహాత్మక సేవలను అందిస్తోంది. మరోవైపు నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తు భారీ ప్రాణనష్టం, విధ్వంసానికి దారితీసింది. భారత విదేశాంగ శాఖ ప్రకారం సుమారు 320 మంది భారతీయులు ఇంకా గల్లంతైన లేదా సంప్రదింపులకు అందని వారి జాబితాలో ఉన్నారు. సహాయక, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!