

సల్మాన్ ఖాన్ నటించనున్న కర్ణ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ పౌరాణిక చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. బాహుబలి, రామాయణం తరహాలో అద్భుతమైన దృశ్యాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.
గత 5 సంవత్సరాలుగా కర్ణ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఆగస్టు నాటికి షూటింగ్ ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈలోపు విక్రాంత్ మాస్సేతో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఓ చిన్న పట్టణం నేపథ్యంలో రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. కర్ణ ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం సమాంతరంగా కొనసాగనున్నాయి. సల్మాన్, రాకేష్ కాంబినేషన్లో రాబోయే ఈ భారీ చిత్రం భారతీయ బాక్సాఫీస్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!