

ఉత్తరప్రదేశ్లోని వారణాసి పరిధిలో గంగానదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరగడంతో బోటు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాటర్ పోలీస్ అధికారులు ఏసీపీ దశాశ్వమేధ, డా. అతుల్ అంజాన్ త్రిపాఠి తెలిపారు. శనివారం ఉదయం గంగానదిలో నీటిమట్టం 64.70 మీటర్లకు చేరగా, ప్రతి గంటకు సుమారు 6 సెంటీమీటర్ల మేర పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ ప్రవాహం, వర్షాల కారణంగా బోట్ల నిర్వహణ ప్రమాదకరంగా మారడంతో అన్ని బోటు ఆపరేటర్లకు సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సందర్శకులు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బోటు సర్వీసుల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఒడిశా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 16 నుంచి 18 వరకు వర్షాల ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!