

నీట్ (NEET) పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నిర్వహిస్తున్న ఈ కీలక పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు. వైద్య విద్యలో ప్రవేశానికి ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష అని పేర్కొన్న ముఖ్యమంత్రి, విద్యార్థులు తమ కృషి, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పరీక్షకు తెలంగాణలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్ష రాయాలని సూచించారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!