

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిరసన కార్యక్రమాల లోగోను ఆవిష్కరించడంతో పాటు పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, సెప్టెంబర్ 3న వ్యవసాయం, సాగునీటి రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై రైతు సదస్సులు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 4న పెన్షన్లు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి హామీల అమలుపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 5న జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యపై నిరసనలు, 6న సిద్ధిపేటలో ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 7న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తులు సమర్పించనున్నారు. ఈ వారం రోజుల ఆందోళనల్లో పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!