

ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిపై నిన్న పోలీస్ స్టేషన్లోనే దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి జరిగిందని కేటీఆర్ అన్నారు. ఆ దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన తమను పోలీస్ స్టేషన్లో ఉంచి తమపై కూడా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాజాగా తన పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్లోనే 15 మందితో దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని కేటీఆర్ ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు పోలీసులు లేదా గుండాలా, మఫ్టీలో వచ్చిన వారు ఎవరో తేలాల్సి ఉందన్నారు. తమ వారిపై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. ఈ అంశంపై కోర్టులను ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిరాశ, నిస్పృహల్లో ఉందని, వెయ్యి రోజుల తర్వాత తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!