

భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేయడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రశంసలు కురిపించింది. తాజాగా వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో వైట్హౌస్ సానుకూలంగా స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్రియాశీలకంగా, దృఢంగా, స్థితిస్థాపకతతో ఉందని వైట్హౌస్ సీనియర్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ కొనియాడారు.
నార్త్ కరోలినాలో జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్పై ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని ఈ జీడీపీ గణాంకాలు మరింత బలపరిచాయని ఆయన పేర్కొన్నారు. ఇది అమెరికా ప్రభుత్వానికి, అక్కడి కార్పొరేట్ సంస్థలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామమని అభిప్రాయపడ్డారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని, అదే సమయంలో అమెరికాలోనూ భారతీయ పెట్టుబడులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని, ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న మైత్రి గురించి తరచూ ప్రస్తావిస్తుంటారని దేశాయ్ గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య మరింత ఫలప్రదమైన చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు రాజకీయ స్థాయి నుంచి సాంకేతిక దశకు చేరుకున్నాయని, దిగుమతుల వర్గీకరణకు ఉపయోగించే హెచ్టీఎస్ కోడ్ల వంటి నిర్దిష్ట అంశాలపై నిపుణుల బృందాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!