

మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన నియంత్రణల కారణంగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో కీలక వాటాదారు సర్ రతన్ టాటా ట్రస్ట్ తన ప్రతినిధిని నియమించలేకపోతోంది. దీంతో ఈ నెల 18న జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. సంస్థ నిర్ణయించిన తేదీలో ఎలాంటి మార్పు లేదని వాటాదారులకు సమాచారం అందలేదు. అవసరమైన కనీస సభ్యుల హాజరు లేకపోతే సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసిన తర్వాత మరోసారి అదే పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్టర్ పదవితో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ భావించింది. అయితే మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో సర్ రతన్ టాటా ట్రస్ట్ పాలక మండలి సమావేశం జరగలేదు. దీంతో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్తో కలిసి ప్రతినిధిని నియమించే ప్రక్రియ నిలిచిపోయింది. టాటా సన్స్ సంస్థ నిబంధనల ప్రకారం సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల హాజరు కోసం ఈ ప్రతినిధి నియామకం కీలకం కావడంతో సమావేశం జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!