

ఉద్యోగం మానేసిన వెంటనే ఈపీఎఫ్ ఖాతాలోని నిధులపై వడ్డీ ఆగిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది అపోహేనని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి వైదొలిగినంత మాత్రాన పీఎఫ్ నిధులపై వడ్డీ నిలిచిపోదని తెలిపింది. ఖాతా ఇన్ఆపరేటివ్గా మారే వరకు వడ్డీ ప్రయోజనం కొనసాగుతుందని పేర్కొంది. అంటే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా ఖాతాలో ఉన్న మొత్తానికి నిబంధనలకు అనుగుణంగా వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అందువల్ల అత్యవసర అవసరం లేకపోతే పీఎఫ్ మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖాతా ఇన్ఆపరేటివ్గా మారుతుంది. 55 ఏళ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో 36 నెలల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోతే ఖాతా ఇన్ఆపరేటివ్గా మారే అవకాశం ఉంటుంది. 55 ఏళ్లకు ముందే ఉద్యోగం మానేసిన సందర్భంలో సాధారణంగా 58 ఏళ్లు వచ్చే వరకు ఖాతా ఇన్ఆపరేటివ్గా మారదు. ప్రస్తుతం ఈపీఎఫ్పై 8.25 శాతం వడ్డీ రేటు ఉన్నట్లు సమాచారం. ఏటా వడ్డీ అసలుకు జత కావడంతో దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో నిధి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్ కోసం పొదుపు చేసిన పీఎఫ్ మొత్తాన్ని అవసరం లేకుండా ముందుగానే ఉపసంహరించుకోకుండా ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!