

దక్షిణాది కథలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ దక్షిణ భారత సినిమాలు, సిరీస్లపై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం రాబోయే ఐదు సంవత్సరాల్లో కంపెనీ రూ. 4,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. అంతేకాక, వచ్చే 12 నెలల్లో 1,500 గంటల కొత్త సౌత్ కంటెంట్ విడుదల చేయాలని జియోహాట్స్టార్ భావిస్తోంది.
జియోహాట్స్టార్లో సౌత్ కంటెంట్ కోసం ప్రేక్షకుల వినియోగ సమయం 70 శాతం పెరిగింది, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని క్లస్టర్ ఎంటర్టైన్మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి తెలిపారు. దక్షిణాది కంటెంట్ ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నదని, చాలామంది ప్రేక్షకులు దీన్ని ఎక్కువగా చూస్తున్నారని కృష్ణన్ తెలిపారు.
దక్షిణాది కంటెంట్కు అధిక సబ్స్క్రిప్షన్, మెరుగైన యాక్టివ్ యూజర్లు, ఎక్కువ టీవీ కనెక్ట్ వినియోగం ఉన్నట్టు కృష్ణన్ చెప్పారు. ఈ నేపథ్యంతో, జియోహాట్స్టార్ మంగళవారం 25 కొత్త సౌత్ టైటిల్లు, ఒరిజినల్ షోలు, సినిమాలు, సిరీస్లను ప్రకటించింది.
దక్షిణాది కంటెంట్తోపాటు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. జియోహాట్స్టార్ తాజా నిర్ణయం ద్వారా ప్రాంతీయ కంటెంట్కు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంగ్లీష్ కంటెంట్ వ్యూస్పై ప్రభావం ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన ప్రాంతీయ కంటెంట్ దీన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలదు. ముఖ్యంగా జీ5 లాంటి ప్లాట్ఫామ్లు సాంస్కృతికంగా పాతుకుపోయిన స్థానిక కంటెంట్ ద్వారా టైర్-2, టైర్-3 ప్రాంతాలను లక్ష్యంగా పెట్టి కంటెంట్ అందిస్తున్నాయి.
ఓర్మాక్స్ మీడియా ప్రకారం, దేశంలో ఓటీటీ యూజర్ల వృద్ధి ఈ ఏడాది 9.9 శాతం పెరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!