

కృత్రిమ మేధస్సు పూర్తిగా కొత్త దశలోకి అడుగుపెట్టిందని Microsoft ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ Puneet Chandok పేర్కొన్నారు. ఏఐ ఇకపై కేవలం హైప్ లేదా ప్రయోగ దశలో లేదని, ఇప్పటికే వ్యాపార సంస్థలు పనిచేసే విధానాన్ని మార్చుతోందని ఆయన తెలిపారు.
చాలా సంస్థలు ఏఐని పరీక్షించే దశను దాటి, నిజమైన వ్యాపార ఫలితాలను పొందేందుకు వినియోగిస్తున్నాయని చందోక్ అన్నారు. సామర్థ్యాన్ని పెంచడం నుంచి నిర్ణయాలను మరింత సమర్థవంతంగా తీసుకోవడం వరకు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నదని వివరించారు.
అయితే, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు సురక్షితంగా మరియు సమర్థంగా ఏఐను ఉపయోగించాలంటే అప్స్కిల్లింగ్ తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.
ఏఐ యొక్క తదుపరి దశ బాధ్యతాయుతమైన, ఆలోచనాత్మక వినియోగమేనని చందోక్ తెలిపారు. గతంలో కొద్ది మంది నిపుణులకే పరిమితమైన ఏఐ, ఇప్పుడు శక్తివంతమైన కంప్యూటింగ్ సామర్థ్యం, అధునాతన మోడళ్ల కారణంగా విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ డిజిటల్ సహోద్యోగుల మాదిరిగా పనిచేస్తూ, డేటా విశ్లేషణ, సాధారణ పనులు, నిర్ణయాల్లో మానవులకు సహకరిస్తాయని అన్నారు.
అయితే, ఏఐ పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉంటుందని, తుది ఫలితాలకు మానవులే బాధ్యత వహిస్తారని పునీత్ చందోక్ స్పష్టం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!