

ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ను అధిగమించి టీ20 పరుగుల రారాజుగా అవతరించాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్, వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్తో అతను టీ20ల్లో మొత్తం 14,833 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇప్పటివరకు 746 మ్యాచ్ల్లో 14,803 పరుగులతో పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా, బట్లర్ కేవలం 522 మ్యాచ్ల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (463 మ్యాచ్ల్లో 14,562 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 9 సెంచరీలు, 105 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఈ ఘనత సాధించిన అనంతరం బట్లర్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. "టీ20ల్లో అందరికంటే ఎక్కువ పరుగులు చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇది గర్వకారణమైన క్షణం. భవిష్యత్తులో ఎవరో ఒకరు ఈ రికార్డును అధిగమిస్తారు. అతడు బహుశా సూర్యవంశీ కావచ్చు" అని సరదాగా వ్యాఖ్యానించాడు. "క్రికెట్ ఎంత వేగంగా మారిపోతుందో చెప్పలేం. కొన్ని నెలల క్రితం ఫామ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను. కానీ, గత కొన్ని వారాలుగా నా కెరీర్లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఫామ్ను తిరిగి పొందడానికి ఎంతో కష్టపడ్డాను. పట్టుదలతో మళ్లీ ఇక్కడికి వచ్చాను" అని బట్లర్ చెప్పుకొచ్చాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!