

కృత్రిమ మేధ రంగంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ హ్యాక్ట్రాన్ ఏఐకి చెందిన ముగ్గురు భారతీయ మూలాల పరిశోధకులు ఆంత్రోపిక్ క్లాడ్ కృత్రిమ మేధ సాధనాల సాయంతో ఓపెన్ఏఐ వ్యవస్థల్లోని భద్రతా లోపాలను గుర్తించారు. హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలతో కూడిన ఈ బృందం ఓపెన్ఏఐకి సంబంధించిన కమ్యూనిటీ ఫోరమ్లోని లోపాన్ని ఉపయోగించి ఉద్యోగుల చాట్జీపీటీ, కోడెక్స్ ఖాతాలకు చేరుకునే అవకాశాన్ని గుర్తించింది. అనంతరం ఓపెన్ఏఐ ప్రైవేట్ గిట్హబ్ వాతావరణాన్ని చేరుకునే స్థాయిలో ఈ లోపాల ప్రభావాన్ని ప్రదర్శించింది.
ఈ పరిశోధనను ఓపెన్ఏఐ భద్రతా లోపాల నివేదింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ప్రారంభ లోపాన్ని గుర్తించినప్పటి నుంచి అంతర్గత రిపాజిటరీకి చేరుకునే ప్రభావాన్ని నిరూపించే వరకు మొత్తం ప్రక్రియ 72 గంటల్లోపే పూర్తయిందని పరిశోధకులు తెలిపారు. అయితే, అంతర్గత కోడ్ను చదవడం లేదా డౌన్లోడ్ చేయడం చేయకుండా, తమకు లభించిన ప్రాప్యతను నిరూపించేందుకు ఉద్యోగి కోడెక్స్ ఖాతా ద్వారా అంతర్గత రిపాజిటరీలో ఒక పుల్ రిక్వెస్ట్ తెరిచిన అనంతరం పరీక్షలను నిలిపివేశారు. లోపాలను ఓపెన్ఏఐకి తెలియజేయగా, సంస్థ వాటిని సరిచేసి ప్రభావిత ధృవీకరణ టోకెన్లు, సెషన్లను రద్దు చేసింది. ఈ పరిశోధనకు ఓపెన్ఏఐ 6,500 డాలర్ల బగ్ బౌంటీని అందించింది.
ఈ ముగ్గురు పరిశోధకుల్లో మోహన్ పెదపాటి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందినవారు. ప్రస్తుతం హ్యాక్ట్రాన్ ఏఐలో సీటీఓ, సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన వెబ్ భద్రత, సాఫ్ట్వేర్ లోపాల పరిశోధనలో పనిచేస్తున్నారు. ఆయన రాజమండ్రిలోని జెడ్పీహెచ్ఎస్ సంపత్నగర్లో చదువుకుని, నూజివీడులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు. ఓపెన్ఏఐ వ్యవస్థలపై జరిగిన ఈ భద్రతా పరిశోధనలో భారతీయ మూలాలున్న పరిశోధకుల భాగస్వామ్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!