

ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న వాణిజ్య, వలస విధానాల ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను తీసుకువస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతీయువకులు భారత్లో ఉన్నారని, వారి ఉపాధి మరియు ఉద్యోగావకాశాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 వ రోజ్గార్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 61 వేల మంది యువతకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన కీలక సందేశం ఇచ్చారు.
నియామక పత్రాలను కేవలం ఉద్యోగానికి సంబంధించిన పత్రాలుగా కాకుండా, దేశ నిర్మాణానికి లభించిన ఆహ్వాన పత్రాలుగా భావించాలని సూచించారు. తోటి ఉద్యోగులతో కలిసి దేశ రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాధ్యతాయుతంగా పని చేయాలని యువతను కోరారు.
నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో రోజ్గార్ మేళాలను నిర్వహించినట్లు తెలిపారు.
అలాగే భారత్లో స్టార్టప్ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, వాటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొత్త దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో సుమారు రెండు లక్షల నమోదైన స్టార్టప్లు ఉండగా, వాటిలో 21 లక్షల మందికిపైగా యువత పని చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!