

జన్మతః కాకుండా చట్టబద్ధ ప్రక్రియల ద్వారా అమెరికన్ పౌరసత్వం పొందిన కొందరు విదేశీయుల పౌరసత్వాలను రద్దు చేసే దిశగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వలసల పై కఠిన నియంత్రణలు అమలు చేసే భాగంగా ఈ చర్యలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
ఇతర దేశాలలో జన్మించిన వారు ఉద్యోగం లేదా ఇతర చట్టసమ్మత మార్గాల ద్వారా కొన్నేళ్ల పాటు అమెరికాలో నివసించి, గ్రీన్ కార్డు పొందిన తర్వాత ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, మంచి నైతిక ప్రవర్తన వంటి అర్హతల ఆధారంగా అమెరికా పౌరసత్వం పొందుతారు. ఈ ప్రక్రియను సహజీకరణ (Naturalization) గా పిలుస్తారు.
అయితే, సహజీకృత పౌరసత్వం కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు లేదా మోసాలకు పాల్పడ్డట్లు తేలితే, అటువంటి వారి పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సహజీకృత పౌరులుగా ఉన్న విదేశీ సంతతి వారి సంఖ్య సుమారు 2.6 కోట్లకు చేరిందని The New York Times వెల్లడించింది. గత ఏడాది మాత్రమే సుమారు 8 లక్షల మందికి కొత్తగా సహజీకృత పౌరసత్వం లభించింది.
ఈ నేపథ్యంలో, మోసాలకు పాల్పడిన సహజీకృత పౌరులను గుర్తించి, 2026 సంవత్సరంలో నెలకు కనీసం 100 నుంచి 200 మంది వరకు పౌరసత్వాలను రద్దు చేయాలనే లక్ష్యంతో అమెరికా పౌరసత్వ, వలస వ్యవహారాల విభాగానికి ఆంతరంగిక ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అయితే, సహజీకృత పౌరసత్వాల రద్దుకు కోటా విధించడం సరైనది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నెలవారీగా జరిగిన రద్దుల కంటే పది రెట్లు ఎక్కువగా లక్ష్యాన్ని నిర్దేశించడం ఆందోళన కలిగిస్తోందని వారు అంటున్నారు. మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా దరఖాస్తుల్లో తెలియక జరిగిన పొరపాట్లకు కూడా శిక్ష విధించడం అన్యాయమని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మాదక ద్రవ్య ముఠాలకు చెందినవారు, హింసాత్మక నేరాలకు పాల్పడినవారు, ఆర్థిక నేరస్థులను అమెరికా నుంచి బయటకు పంపడమే తమ అసలు లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!