

తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, ఇందులో కొత్తదనం లేదని, దూరదృష్టితో కూడిన పథకాలు కరవయ్యాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ప్రజలు దీన్ని ఒక ‘బ్లాస్ట్’ అనుకుంటే, ఇది ‘వేస్ట్’గా తేలింది. ఇది గత ‘ద్రవిడ మోడల్’ ప్రభుత్వ బడ్జెట్కు రీమేక్ తప్ప మరొకటి కాదు" అని స్టాలిన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు భారీ ప్రకటనలు ఆశించారని, కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయని అన్నారు. "ఈ బడ్జెట్ బాంబులా పేలుతుందని అందరూ అనుకుంటే, చివరికి తుస్సుమన్న పటాసులా మారింది" అని ఆయన ఎద్దేవా చేశారు. గత డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్త రంగులు పులిమి, తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ బిల్లుల గందరగోళం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వంటి ప్రధాన సమస్యలను బడ్జెట్లో ఏమాత్రం ప్రస్తావించలేదని స్టాలిన్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో టీవీకే ఇచ్చిన ప్రధాన హామీల గురించి బడ్జెట్లో మౌనం వహించడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. "మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగ యువతకు రూ.4,000, ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పంట రుణాల పూర్తి మాఫీ వంటి హామీల ఊసే లేదు" అని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రానికి దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను అందించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని స్టాలిన్ దుయ్యబట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!