

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ వ్యవహారం రాజ్యాంగానికే గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కు కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల ముందే ఉన్నప్పటికీ, ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్థరహితమని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల మేధస్సును అవమానపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు.
సుప్రీంకోర్టు తీర్పును, ప్రజల తీర్పును కూడా కాలరాస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పీకర్ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఒకవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలోనే, ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో ఇంకా కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్లకు భయపడుతోందన్న విషయం స్పష్టమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకపై రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగే నైతిక హక్కు లేదని తీవ్రంగా విమర్శించారు. పట్టపగలే పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా సీఎం సాగిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలో తప్పకుండా గుణపాఠం చెప్పబడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!