

దేశ విభజన ఎన్నో జీవితాలను, కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని, తమ కుటుంబాలను కోల్పోయి తీవ్ర విషాదాన్ని అనుభవించిన బాధితులను స్మరించుకుంటూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజున ప్రతి ఏడాది ‘విభజన విషాదాల స్మృతి దినం’ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 నుంచి దేశ విభజన, సామూహిక వలసలు, అనంతరం జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని పాటిస్తోంది.
విభజన గాయాల నుంచి కోలుకున్న ప్రజలు ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని మోదీ అన్నారు. అనేక కుటుంబాలు చెల్లాచెదురైనా, బాధితులు తమ జీవితాలను తిరిగి నిలబెట్టుకుని దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వారి జీవితాలు సామరస్యం, సోదరభావాన్ని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలనే స్ఫూర్తిని అందిస్తున్నాయని ప్రధాని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!