

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది రాజకీయాల్లో నైతిక విలువలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే అసభ్య వ్యాఖ్యల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన తర్వాత రాష్ట్రపతి లేదా కేంద్ర హోంమంత్రిని కలవాలనుకోవడం వైసీపీ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేక రాజకీయాలు మానేసి గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని సూచించారు. ఏపీలో వైసీపీ ఆవిర్భావం రాష్ట్ర ప్రజల కర్మగా మారిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!