

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం చోటుచేసుకున్న తొక్కిసలాట దేశవ్యాప్తంగా దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా అనే వ్యక్తి స్వంతంగా నిర్మించారు. కేవలం నాలుగు నెలల క్రితమే ప్రారంభమైన ఈ దేవాలయానికి సాధారణంగా రోజుకు కొన్ని వందల మంది మాత్రమే వచ్చేవారు. కానీ కార్తీక ఏకాదశి, శనివారం కలిసిన రోజు కావడంతో ఒకేసారి 15 నుండి 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయం గరిష్టంగా రెండు వేల మంది భక్తుల రద్దీని మాత్రమే తట్టుకోగలదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా అధిక జనసందోహం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో నిర్మించబడి నడుస్తోందని, దేవాదాయ శాఖకు దీని నిర్వహణతో సంబంధం లేదని స్పష్టం చేశారు. భక్తుల ప్రాణ నష్టం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇకపై ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ పెట్టనుంది. భక్తుల భద్రత కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయనుంది. మరోవైపు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున సహాయం అందజేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. హరిముకుంద పండా సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. తాను స్వప్నంలో దుర్గాదేవి ఆదేశంతో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించానని ఆయన చెప్పిన విషయం తెలిసింది. ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవి విగ్రహాలతో పాటు రామాయణం, మహాభారత ఘట్టాలను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్లకు పైగా శ్రమించి ఆలయం పూర్తయింది.
ప్రస్తుతం ఈ విషాదం రాష్ట్రాన్ని కలచివేసింది. భవిష్యత్తులో భక్తుల భద్రత కోసం ప్రభుత్వ చర్యలు మరింత కఠినంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!