

తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి, కోనసీమకు ముందే వచ్చినట్లుగా గోదావరి తీర ప్రాంతం సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ’ సంక్రాంతి వేడుకలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సంబరాలకు రంగులు అద్దారు.
ఈ వేడుకల్లో కిలోమీటరు మేర రంగవల్లులు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 350 మంది మహిళలు పాల్గొన్నారు. ఆత్రేయపురం వంతెన వద్ద జరిగిన ఈత పోటీల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు 234 మంది పోటీ పడ్డారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో పూతరేకులు, బొబ్బట్లు, మిల్లెట్ వంటకాలు, చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రాగన్ బోటు, కయాకింగ్, కనోయింగ్ పోటీలు సోమవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. పలు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!