

తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది ఓ ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదల కావడం అరుదు. అవి మూడు వేర్వేరు భాషల్లో రావడం, మూడు కూడా ఆయా భాషల్లో విజయం సాధించడం ఇంకా అరుదైన విషయం. ఈ అపూర్వ ఘనతను నమోదు చేసుకున్న హీరో ధనుష్ మాత్రమే.
ఈ ఏడాది జూన్లో ధనుష్ నటించిన ‘కుబేర’ విడుదలైంది. ‘సార్’ తర్వాత అతను చేసిన రెండో తెలుగు చిత్రం ఇది. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, తమిళంలో మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు.
దీనికి తోడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో పెద్ద స్పందన రాకపోయినా, ధనుష్ అసలు బలం అయిన తమిళంలో ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. ఓటీటీ లో రిలీజ్ అయిన తర్వాత మరింత ఆదరణ దక్కి, దర్శకుడిగా అతని నాలుగో సక్సెస్గా నిలిచింది.
ఇప్పుడిక హిందీలో విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ తో ధనుష్ మళ్ళీ జై కొట్టాడు. ‘రాన్జానా’ తో ధనుష్ కు గుర్తుండిపోయే చిత్రం తీసిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కృతి సనన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో బజ్ సృష్టించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది.
తొలి రోజు ఇండియాలోనే రూ.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్ మొత్తం స్టడీగా కొనసాగి హాఫ్ సెంచరీ మార్క్ను దాటి దూసుకెళ్లింది. వర్క్డేస్లో కూడా కలెక్షన్లు బాగానే నిలవడంతో ధనుష్కు బాలీవుడ్లో మరో హిట్ ఖాయం అయింది. అతని నటనకు ప్రేక్షకులు, విమర్శకులు సమానంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలా ఒకే ఏడాది మూడు భాషల్లో హిట్లు కొట్టిన హీరోగా ధనుష్ ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను మరెవరైనా సమీప భవిష్యత్తులో అధిగమించడం కష్టమే అని చెప్పొచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!