

మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కరవుతో ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కోసం 1996లో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేసి ప్రారంభించబోతుండటం తనకు ఎంతో సంతోషంగా, భావోద్వేగంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు నల్లమల సాగర్లోకి చేరడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలకు పరిష్కారం లభిస్తుందని సీఎం అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, పుట్టిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రైతులకు భరోసా, ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య రక్షణ, వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై అవకాశాలు, వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి బాట చూపించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రేపు జరిగే వెలిగొండ ప్రారంభోత్సవానికి ప్రజలు హాజరై వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!