

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని హైదరాబాద్లోని సింధు ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలించారు. కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు తుది నివాళులు అర్పించారు. సాయంత్రం కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రికి కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని తొలుత పోలీసులు ప్రత్తిపాడు సమీపంలో నిలిపివేశారు. కుటుంబ సభ్యుల అభ్యంతరం ఉన్నట్లు పోలీసులు తెలిపినా, ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చివరకు నివాళులు అర్పించేందుకు అనుమతించారు. నివాళుల అనంతరం వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి, కుమార్తె మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాను మరణిస్తే క్రాంతి రావొద్దని ముద్రగడ గతంలో పేర్కొన్నట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!