

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎన్టీఏ ప్రశ్నపత్రాల భద్రతా వ్యవస్థలోని లోపాలు, కొందరు సబ్జెక్టు నిపుణుల పాత్రపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కేసులో 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. రెసిడెన్షియల్ యాక్సెస్ కంట్రోల్ రికార్డులు, మొబైల్ ఫోన్ లొకేషన్లు, బయోమెట్రిక్ వివరాలు సహా డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించింది. ప్రశ్నపత్రాల తయారీ, అనువాద ప్రక్రియలో భాగమైన కొందరు నిపుణులు తమకు లభించిన రహస్య ప్రశ్నలను దుర్వినియోగం చేసి, మధ్యవర్తులు, కోచింగ్ నెట్వర్క్ల ద్వారా అభ్యర్థులకు చేరవేశారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ పేర్కొంది.
దిల్లీలోని ఎన్టీఏ కార్యాలయంలో ప్రశ్నల రూపకల్పన, అనువాదం జరిగే ప్రాంతాల్లో తగిన సీసీటీవీ నిఘా లేకపోవడం, నిపుణుల రాకపోకలపై కట్టుదిట్టమైన తనిఖీలు లేకపోవడం వంటి లోపాలను సీబీఐ గుర్తించినట్లు తెలిపింది. ఈ పరిస్థితిని కొందరు నిపుణులు అవకాశంగా మార్చుకున్నారని, అనువాద సమయంలో కొన్ని ప్రశ్నలను చీటీలపై రాసుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం ద్వారా బయటకు తీసుకెళ్లారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. అనంతరం మధ్యవర్తులు, కోచింగ్ నెట్వర్క్ల ద్వారా ఆ ప్రశ్నలు అభ్యర్థులకు చేరినట్లు పేర్కొంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా నిర్వహించే కీలక ప్రవేశ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!