

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గం గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్, ఒమన్ దేశాలు నిర్దిష్ట నౌకాయాన మార్గంపై ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ వెల్లడించారు. వారాలపాటు సాగిన సాంకేతిక చర్చల అనంతరం నౌకలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన మ్యాప్పై ఇరుదేశాలు అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.
ఒమన్తో ఇతర అంశాలపై సాంకేతిక, రాజకీయ సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని బఘాయీ తెలిపారు. అయితే ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన హోర్ముజ్ జలసంధిలో సాధారణ స్థాయిలో నౌకాయానం వెంటనే పునరుద్ధరించబడుతుందని చెప్పలేమని స్పష్టం చేశారు. ప్రాంతీయ పరిస్థితులు, నౌకాయానంపై ఉన్న ఆంక్షలు వంటి అంశాలు కూడా కీలకమని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి తీర దేశాలైన ఇరాన్, ఒమన్ గతంలోనూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకల సురక్షిత రాకపోకలకు కట్టుబడి ఉన్నామని, తమ సార్వభౌమ హక్కులను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!