

వైసీపీ పాలన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరఫరా చేసి భారీగా అక్రమ లాభాలు ఆర్జించిన ముఠాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సంపాదించిన డబ్బుతో దాదాపు రూ.45 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు కొనుగోలు చేయడంతో పాటు భారీ భవనాల నిర్మాణం చేపట్టినట్లు ఈడీ గుర్తించింది. బోగస్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్లు, హవాలా మార్గాల ద్వారా అక్రమ సొమ్మును మళ్లించి స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో భాగంగా ఈడీ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ, మాల్గంగా డెయిరీలకు చెందిన ప్రతినిధులు, హవాలా ఏజెంట్లు, నకిలీ రికార్డులు సృష్టించిన వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలు, డెయిరీ ప్లాంట్లలో తనిఖీలు చేపట్టింది. 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి దాదాపు 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి సుమారు రూ.235 కోట్ల అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. సోదాల్లో రూ.60 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా, మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!