

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం రాష్ట్రాల అధికార యంత్రాంగాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుమానిత విదేశీయులు గుర్తిస్తే, వారిపై వివరాలను పౌరసత్వ చట్టం 1955 ప్రకారం సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. అలాగే సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ అధికారాలను స్వతంత్రంగా వినియోగించి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఇళ్ల లెక్కింపు పత్రాలు తిరిగి రాని సందర్భాల్లో బూత్ స్థాయి అధికారులు స్థానికంగా విచారణ జరిపి, అందుబాటులో లేకపోవడం, నివాసం మారడం, మరణించడం లేదా ద్వంద్వ నమోదు వంటి కారణాలను నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గత నెల 14వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. మే 30 నుంచి 36.73 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను దశలవారీగా నిర్వహిస్తున్నారు. ఈ చర్యలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!