

దివంగత నటుడు జెమినీ గణేశన్ మనవరాలు, ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. కేవలం ఏడు నెలల వ్యవధిలో 8,000 మీటర్లకు పైబడిన రెండు శిఖరాలను అధిరోహించిన 50 ఏళ్లు దాటిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎవరెస్ట్ను అధిరోహించడం తనకు ఎంతో కఠినమైన లక్ష్యమని, దృఢ సంకల్పం మరియు ఆధ్యాత్మిక నిబద్ధతతో దాన్ని సాధించానని ఆమె తెలిపారు.
2021లో ఎవరెస్ట్ను అధిరోహించాలనే ఆలోచన ప్రారంభమైందని, దాని కోసం నాలుగేళ్లపాటు కఠిన శిక్షణ తీసుకున్నానని ప్రియా వెల్లడించారు. ఇంటి మరియు ఆసుపత్రి మెట్లు ఎక్కడం, వంతెనలపై నడవడం వంటి సాధారణ వ్యాయామాలే తన శిక్షణలో భాగమని చెప్పారు. రోజుకు 12 నుంచి 13 గంటల పాటు పర్వతారోహణ చేస్తూ కేవలం ఎనిమిది రోజుల్లో శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో జారిపడినా భద్రతా తాడు కారణంగా ప్రాణాపాయం తప్పిందన్నారు. ఎవరెస్ట్కు ముందు 8,163 మీటర్ల ఎత్తైన మానస్లు శిఖరాన్ని కూడా అధిరోహించిన ఆమె, కుటుంబ సహకారమే తన విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. యువత మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా వ్యాయామం చేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!