

హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబాలతో ప్రశాంతంగా గడిపే ప్రదేశాలుగా ఉన్న ఈ ఫాంహౌస్లు ఇప్పుడు మత్తు పదార్థాలు, పేకాట, రేవ్ వేడుకలు, వ్యభిచారం వంటి అక్రమ కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పెరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు ఫాంహౌస్ల వెనుక జరుగుతున్న చీకటి దందాలను బయటపెట్టాయి. మత్తు పదార్థాల వినియోగం, అశ్లీల నృత్యాలు, కోడి పందాలు, జూదం వంటి కార్యక్రమాలు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మైనర్లు ఈ పార్టీలకు హాజరవుతుండటం సమాజానికి ప్రమాదకర సంకేతంగా భావిస్తున్నారు.
సైబరాబాద్, రాచకొండ పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ నిర్వాహకులు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారని సమాచారం. గోప్య సమూహాల ద్వారా సమాచారం పంచుకుంటూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్న ఫాంహౌస్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శాశ్వతంగా మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!