

టీవీ ఛానెళ్లలో ప్రకటనల ప్రసారంపై ఉన్న కీలక పరిమితిని కేంద్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం గంట వ్యవధిలో గరిష్ఠంగా 12 నిమిషాల పాటు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈ పరిమితిని ఎత్తివేస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. టీవీ ఛానెళ్ల మధ్య న్యాయమైన పోటీకి అవకాశం కల్పించడంతో పాటు, వాటి వ్యాపార నిర్వహణకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సమాచార, ప్రసార శాఖ తెలిపింది. పే ఛానెళ్లు, ఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లు రెండూ ప్రకటనల ఆదాయంపై ఆధారపడుతున్నాయని పేర్కొంది.
ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లకు మాత్రమే కాకుండా డిజిటల్ మీడియా సంస్థల నుంచి కూడా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పు తీసుకొస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్-1994ను సవరించనున్నారు. సవరించిన నిబంధనలు గెజిట్లో ప్రచురితమైన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సమాచార, ప్రసార శాఖ తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!