

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16న గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమైన వేడుకలు, ఈ రోజు మహాకుంభహారతితో ముగిశాయని చెప్పారు. నెలరోజుల పాటు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళా ప్రదర్శనలు, అంబారీల ఊరేగింపులు, రంగం, ఘటోత్సవాలతో బోనాల జాతర వైభవంగా సాగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రూ.20 కోట్లతో జాతరను నిర్వహించామని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని వేలాది ఆలయాల్లో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు, జీహెచ్ఎంసీ, విద్యుత్, వైద్య, పారిశుధ్య, తాగునీరు, ట్రాఫిక్, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. బోనాలు తెలంగాణలోని భిన్నత్వంలో ఏకత్వానికి, గంగా-జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!