

భారతదేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. GST 2.0 సంస్కరణల ప్రభావంతో, యూపీఐ (UPI) అక్టోబర్ నెలలో రికార్డు స్థాయికి చేరింది. ఎన్పీసీఐ (NPCI) విడుదల చేసిన వివరాల ప్రకారం, యూపీఐ లావాదేవీలు 25% వార్షిక వృద్ధితో 20.70 బిలియన్లకు, మొత్తం విలువ ₹27.28 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్లో నమోదైన ₹24.90 లక్షల కోట్లతో పోలిస్తే, అక్టోబర్లో లావాదేవీ విలువ గణనీయంగా పెరిగింది. రోజువారీ సగటు లావాదేవీ విలువ ₹87,993 కోట్లు, సెప్టెంబర్లోని ₹82,991 కోట్లతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అక్టోబర్లో సగటు రోజువారీ లావాదేవీలు 668 మిలియన్లు, సెప్టెంబర్లోని 654 మిలియన్లతో పోలిస్తే పెరిగాయి.
ఇంకా IMPS (ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్) లావాదేవీలు కూడా 2% వార్షిక వృద్ధి, 6% నెలవారీ వృద్ధి సాధించి ₹6.42 లక్షల కోట్లకు చేరాయి. రోజువారీ IMPS లావాదేవీ విలువ ₹20,709 కోట్లు, సెప్టెంబర్లోని ₹19,895 కోట్లను అధిగమించింది.
మొత్తంగా, యూపీఐ దేశంలో డిజిటల్ పేమెంట్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. 2025 తొలి అర్థభాగంలో యూపీఐ లావాదేవీలు 35% వృద్ధితో 106.36 బిలియన్లకు, మొత్తం విలువ ₹143.34 లక్షల కోట్లకు చేరాయి. వరల్డ్లైన్ రిపోర్ట్ (1H 2025) ప్రకారం, Person-to-Merchant (P2M) లావాదేవీలు 37% వృద్ధితో 67.01 బిలియన్లకు పెరిగాయి. చిన్న వ్యాపారాలు, కిరాణా దుకాణాలు వంటి మైక్రో బిజినెస్లు దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమవుతున్నాయి. అలాగే, భారత్లోని QR కోడ్ పేమెంట్ నెట్వర్క్ కూడా భారీగా పెరిగి 2025 జూన్ నాటికి 678 మిలియన్లకు చేరింది – ఇది 2024 జనవరిలో కంటే 111% వృద్ధి అని నివేదిక పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!