

టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డ అహ్మదాబాద్లో జరిగే ఈ తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. 20 నెలల క్రితం వెస్టిండీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ను అందుకున్న క్షణాలు ఇంకా అభిమానుల కళ్లముందే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి టీమ్ ఇండియా ఫైనల్ చేరి చరిత్ర సృష్టించే అవకాశాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ విజయం సాధిస్తే సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని గెలిచిన మొదటి జట్టుగా కూడా చరిత్ర సృష్టిస్తుంది.
అయితే ఫైనల్లో భారత్కు న్యూజిలాండ్ కఠిన ప్రత్యర్థిగా నిలవనుంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించి కివీస్ తమ బలం చూపించింది. ఆ మ్యాచ్లో ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే శతకం బాదగా, సీఫర్ట్ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇద్దరు ఓపెనర్లను పవర్ప్లేలోనే భారత్ ఆపగలిగితే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మరోవైపు బుమ్రా, అర్ష్దీప్, అక్షర్ వంటి బౌలర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఫైనల్లో ఎవరు హీరోగా నిలుస్తారో, ఎవరి చేతుల్లో కప్పు ఎగురుతుందో అనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, దూబె, అక్షర్, అర్ష్దీప్, బుమ్రా, వరుణ్/కుల్దీప్.
న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), మెకాంకీ, నీషమ్/డఫీ, హెన్రీ, ఫెర్గూసన్.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!