

తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గురువారం ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినమ్రంగా నమస్కరించారు. కొద్దిసేపు అక్కడ గడుపుతూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాకతో అక్కడ ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు చేరుకుని తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. ‘జై ఎన్టీఆర్’ నినాదాలతో ట్యాంక్బండ్ పరిసరాలు మార్మోగాయి. అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభివాదం చేస్తూ వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. భారీగా అభిమానులు తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్యాంక్బండ్ ప్రాంతంలో ప్రత్యేక నియంత్రణ చర్యలు అమలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!