

ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, క్షిపణుల వినియోగం పెరుగుతున్నప్పటికీ భూతల యుద్ధాల్లో ట్యాంకులు ఇప్పటికీ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో ట్యాంకులు ఇనుప గోడలా నిలిచి భద్రతను బలోపేతం చేయడంతో పాటు సైనికుల మనోస్థైర్యాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పుర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో రూ.472 కోట్ల వ్యయంతో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతులు, పునరుద్ధరణ కేంద్ర నిర్మాణానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు.
జబల్పుర్లో ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త కేంద్రం ద్వారా ప్రతి ఏడాది 80 టీ-72, టీ-90 ట్యాంకులను ఓవర్హాల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక బలగాల్లో ఒకటని పేర్కొన్నారు. సైన్యానికి ప్రతి ఏడాది సుమారు 230 ట్యాంకుల ఓవర్హాల్ అవసరం ఉండగా, తమిళనాడులోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఏటా దాదాపు 150 ట్యాంకులను పునరుద్ధరిస్తోంది. మిగిలిన ట్యాంకుల ఓవర్హాల్ బాధ్యతను జబల్పుర్లో ఏర్పాటు చేస్తున్న కొత్త కేంద్రం నిర్వహించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!