

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నూతన దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాల కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపుదిద్దుకుంది. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేయగా, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందించనున్న ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్, విశాలమైన క్రీడా మైదానాలు, ప్రత్యేక కోచ్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనుండగా, సమీప గ్రామాల విద్యార్థుల కోసం ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1,814 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!