

తెలంగాణలో ‘ఎస్ఐఆర్’ పేరుతో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. ఓట్ల తొలగింపుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తోందని విమర్శించారు. బిహార్, పశ్చిమ బెంగాల్తో పోలిస్తే తెలంగాణలో ఓట్ల తొలగింపు భారీగా జరిగిందని పేర్కొన్నారు.
2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన పౌరులకు ఓటు హక్కు దూరం చేయడం సమంజసం కాదని మహేశ్కుమార్గౌడ్ అన్నారు. పాత జాబితాతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి పౌరుడికి వెంటనే ఓటు హక్కు కల్పించాలని, రాష్ట్రంలో ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ గడువును మరింత పొడిగించాలని కోరారు. ఈ నెల 20న రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేసేందుకు రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మహేశ్కుమార్గౌడ్.. ఆదివాసీ, లంబాడా వర్గాలకు కాంగ్రెస్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!