

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోల అమలును నిలిపివేసింది. ఆ జీవోల ఆధారంగా ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పథకాల అమలుకు జారీ చేసిన జీవోలకు రాజ్యాంగబద్ధత లేదని పిటిషనర్ వాదించారు. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అవివాహిత యువతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించారని తెలిపారు.
చట్టపరమైన నిబంధనల ఆధారం లేకుండా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆదాయ పరిమితితో పాటు అర్హత ప్రమాణాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం వెల్లడించలేదని, భారీగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. గత విచారణలో చట్టపరమైన అనుమతులపై కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హాజరై చెప్పినా ఇప్పటివరకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది మరోసారి గడువు కోరుతున్న నేపథ్యంలో జీవోల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!